కాళేశ్వరం విజయాన్ని క్లెయిమ్ చేసుకుంటున్న బీఆర్ఎస్ – కాంగ్రెస్ ఆరోపణల్ని నిరూపించలేకపోయిందా?

0
4

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్‌ను సంతోషపరిచింది. కాంగ్రెస్ ను డిఫెన్స్‌ లోకి నెట్టేసింది. తర్వాత ఏం జరగబోతోంది?

‎కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు దారితీసింది. ఈ పరిణామం అటు అధికార కాంగ్రెస్‌కు సవాలుగా, ఇటు విపక్ష బీఆర్ఎస్‌కు అందివచ్చిన అస్త్రంగా మారింది.

‎బీఆర్ఎస్ నైతిక విజయం

‎హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ శ్రేణులు తమకు లభించిన క్లీన్ చిట్ గా అభివర్ణిస్తూ రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నాయి. వాస్తవానికి కోర్టు చెప్పింది కేవలం సహజ న్యాయసూత్రాల ఉల్లంఘన గురించి మాత్రమే అయినప్పటికీ, కేసీఆర్, హరీష్ రావులపై తక్షణ చర్యలు తీసుకోవద్దని ఆదేశించడాన్ని గులాబీ దళం ఒక భారీ విజయంగా ప్రచారం చేస్తోంది. గత పది నెలలుగా ఆత్మరక్షణలో ఉన్న పార్టీకి, ఈ తీర్పు కేడర్‌లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, కాంగ్రెస్ చేస్తున్న అవినీతి ఆరోపణలను తిప్పికొట్టేందుకు ఒక బలమైన సాకుగా

‎దొరికింది. వరుస ప్రెస్ మీట్లు, ప్రకటనలతో తాము నిర్దోషులమనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపిస్తున్నారు.

‎కాంగ్రెస్ ఆత్మరక్షణ – క్లారిటీ లేని కౌంటర్

‎ప్రభుత్వ పక్షాన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలు ఇది క్లీన్ చిట్ కాదని, కేవలం సాంకేతిక కారణాలతో వచ్చిన స్టే మాత్రమేనని చెబుతున్నా, అది బీఆర్ఎస్ చేస్తున్న హడావుడి ముందు వెలవెలబోతోంది. ప్రధానంగా కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని ఎన్నికల ముందు గొంతెత్తి చాటిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోవడం ఇప్పుడు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. లీగల్ ప్రాసెస్ లోని లోపాలను సవరించడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు ఇప్పుడు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి.

‎చర్యలు తీసుకోవాలంటే ఎన్నో మార్గాలు

‎నిజానికి జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికతో సంబంధం లేకుండానే, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ, ప్రభుత్వం కేవలం కమిషన్ నివేదికపైనే ఆధారపడటం వల్ల ఇప్పుడు అది న్యాయపరమైన చిక్కుల్లో పడింది. నిందితులకు నోటీసులు ఇచ్చి వారి వాదనలు వినడం అనేది చట్టబద్ధమైన ప్రక్రియ. ఈ చిన్న సాంకేతిక అంశాన్ని విస్మరించడం వల్ల ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చి విచారణను పునరుద్ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది ప్రభుత్వ కాలయాపనకు అద్దం పడుతోంది

‎సీబీఐ విచారణ – స్తబ్ధతకు కారణమేంటి?

‎కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సిఫారసు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. క్షేత్రస్థాయిలో సీబీఐ నుంచి ఎటువంటి కదలిక లేదు. సాంకేతికంగా కేసు నమోదు మినహా, లోతైన దర్యాప్తు ప్రారంభం కాకపోవడం బీఆర్ఎస్‌కు మరింత అడ్వాంటేజ్ గా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అవినీతి పరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని పదేపదే చెబుతున్నారు. అయితే, ఇప్పటికే ప్రభుత్వ హయాంలో గణనీయమైన సమయం ముగిసిపోయింది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా న్యాయపరమైన చిక్కులతో కాలం గడిస్తే, కాళేశ్వరం అవినీతి అనేది కేవలం ఒక ఎన్నికల నినాదంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇచ్చిన హామీ ప్రకారం చర్యలు తీసుకోవడంలో విఫలమైతే, అది కాంగ్రెస్ విశ్వసనీయతపై దెబ్బతీసే అవకాశం ఉంది. వచ్చే రెండున్నరేళ్లలో ప్రభుత్వం ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపైనే రేవంత్ రెడ్డి మార్క్ పాలిటిక్స్ ఆధారపడి ఉంటాయి.