హైదరాబాద్ : తెలంగాణలో మాదకద్రవ్యాల విక్రయాలు మరియు వాడకం పెరిగిపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.
సమాజంలో గౌరవప్రదమైన వృత్తుల్లో ఉన్న డాక్టర్లు, ఇంజనీర్లు సైతం డ్రగ్స్ పెడ్లర్లుగా మారుతుండటం అత్యంత విషాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కేవలం డ్రగ్స్ వాడటమే కాకుండా, వాటి సరఫరాలో విద్యావంతులు భాగస్వాములు కావడం రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాద ఘంటిక అని ఆయన హెచ్చరించారు.
మహిళలపై జరుగుతున్న దాడులు మరియు నేరాలను విశ్లేషిస్తే, నిందితుల్లో అత్యధికులు మత్తు పదార్థాలకు బానిసైన వారేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
గంజాయి వంటి మత్తు పదార్థాల ప్రభావంతోనే విచక్షణ కోల్పోయి అమానవీయ ఘటనలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణను మరో పంజాబ్లా మారనివ్వబోమని, మాదకద్రవ్యాల మూలాలను పెకిలించే వరకు విశ్రమించేది లేదని ఆయన యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు.
విద్యాసంస్థల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో వారిపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గట్టి హెచ్చరిక జారీ చేశారు.
#sidhumaroju










