హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగానియామకమైన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బంజారాహిల్స్లోని స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో మర్యాదపూర్వకంగా కలిశారు.
తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర పోలీస్ బాస్గా బాధ్యతలు అప్పగించినందుకు ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
1991 బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్ ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందిన తర్వాత, మే 1వ తేదీన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన డీజీపీకి శుభాకాంక్షలు తెలుపుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణపై కీలక దిశానిర్దేశం చేశారు.
ముఖ్యంగా డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పనిచేయాలని, మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. పోలీస్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ను బలోపేతం చేయాలని ఆయన సూచించారు.
గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా, ఏసీబీ డైరెక్టర్గా సీవీ ఆనంద్ కనబరిచిన సమర్థవంతమైన పనితీరును పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఆయన సీనియారిటీకి పట్టం కడుతూ ఈ కీలక బాధ్యతలను అప్పగించింది.
రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా పనిచేస్తానని ఈ సందర్భంగా సీవీ ఆనంద్ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.
#sidhumaroju










