మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్కు నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి బి. సుమతి శుక్రవారం తన పదవిని చేపట్టి, భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా స్పష్టమైన సంకల్పాన్ని వ్యక్తం చేశారు.
బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆమెకు ఉన్నతాధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, మల్కాజిగిరి మొదటి మహిళా పోలీస్ కమిషనర్గా నియమితులవడం తనకు గౌరవం మాత్రమే కాకుండా ఒక పెద్ద బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించడం తన ప్రథమ కర్తవ్యమని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రశాంత ప్రాంతంగా పేరుగాంచిన మల్కాజిగిరి ప్రతిష్టను మరింత నిలబెట్టేందుకు కట్టుదిట్టమైన శాంతిభద్రతలు అమలు చేస్తామని, ఎక్కడా రాజీ పడబోమని ధీమా వ్యక్తం చేశారు.
నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తామని పేర్కొన్న సీపీ సుమతి, ముఖ్యంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. AI ఆధారిత “TG QUEST” వంటి టెక్నాలజీని వినియోగిస్తూ, ప్రాసెస్ ఓరియెంటెడ్ మరియు రిజల్ట్ ఓరియెంటెడ్ విధానాలతో బాధితులకు వేగంగా న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని కూడా చెప్పారు.
సమాజానికి పెద్ద ముప్పుగా మారుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆమె, ప్రివెన్షన్ నుంచి ఇన్వెస్టిగేషన్ వరకు అన్ని దశల్లో సమగ్రంగా వ్యవహరిస్తామని తెలిపారు. యువత మత్తుకు బానిస కాకుండా ఉండేందుకు AI ఆధారిత నిఘా వ్యవస్థను అమలు చేస్తామని వెల్లడించారు.
అలాగే, పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని వాహన రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ప్రజల ప్రయాణ భద్రతను మెరుగుపరచడం తమ ప్రాధాన్యతగా ఉంటుందని స్పష్టం చేశారు.
మహిళా పోలీస్ కమిషనర్గా అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, సహకరించిన ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకతతో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని సీపీ సుమతి విశ్వాసం వ్యక్తం చేశారు.
#Sidhumaroju










