హైదరాబాద్ : హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఈనెల 10న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఈ క్రమంలో సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, మరియు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కలిసి గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, గతంలో మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎలాగైతే కనుమరుగైందో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు విడుదల చేస్తున్నా, ఇక్కడ ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు నిధులు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టాక మొదటిసారి తెలంగాణకు వస్తున్నారని, ఈ పర్యటనలో సుమారు రూ. 8,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. మహేశ్వర్ రెడ్డి కూడా సన్నాహక సమావేశాల్లో పాల్గొని సభను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నగరంలోని అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల నుండి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రధాని మోదీకి తమ మద్దతు తెలపాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.
#sidhumaroju
Alwal










