మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : శామీర్పేట్ పరిధిలో నిషేధిత బీటీ-3 (BG-III HP వెరైటీ) పత్తి విత్తనాల అక్రమ రవాణా వ్యవహారాన్ని ఎస్వోటీ కంటోన్మెంట్ టీమ్ ఛేదించింది.
వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి శామీర్పేట్ పోలీసులు నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి 100 కిలోల నిషేధిత పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు శామీర్పేట్ ORR ఎగ్జిట్ నెంబర్-07 వద్ద తనిఖీలు చేపట్టిన అధికారులు, అనుమానాస్పదంగా సంచరిస్తున్న దాసరి శ్రీనివాసరావు (58)ను పట్టుకున్నారు.
గుంటూరు జిల్లా చెబ్రోలు గ్రామానికి చెందిన అతను వ్యవసాయం పేరుతో నిషేధిత బీటీ-3 పత్తి విత్తనాలను రైతులు, ఎరువుల దుకాణాలకు అధిక లాభాల కోసం విక్రయించేందుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది.
అతని వద్ద ఉన్న రెండు సంచుల్లో మొత్తం 100 కిలోల బీటీ-3 విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ విత్తనాలను అన్నమయ్య జిల్లా మదనపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, అధిక ధరలకు అమ్మేందుకు ప్రయత్నించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
ఈ వ్యవహారంలో దాసరి సూరిబాబు అనే మరో వ్యక్తి కూడా భాగస్వామిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
పోలీసుల దర్యాప్తులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే నిందితుడు గతంలో వికారాబాద్ జిల్లా యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన నకిలీ విత్తనాల కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొన్నట్లు అధికారులు తెలిపారు.
వ్యవసాయ నిపుణుల హెచ్చరిక ప్రకారం, నిషేధిత మరియు నకిలీ పత్తి విత్తనాల వాడకం వల్ల నేల నాణ్యత దెబ్బతినడంతో పాటు పంటలు విఫలమై రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగే ప్రమాదం ఉందన్నారు.
ఈ ఘటనపై శామీర్పేట్ పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత (BNS), సీడ్స్ యాక్ట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, సీడ్స్ కంట్రోల్ ఆర్డర్-1983 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఆపరేషన్ మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి ఐపీఎస్ పర్యవేక్షణలో, డీసీపీలు, ఎస్వోటీ అధికారులు, శామీర్పేట్ పోలీసులు మరియు వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు.
#Sidhumaroju
Alwal










