హైదరాబాద్ : తెలంగాణ రవాణా శాఖ రాష్ట్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను అదుపు చేయడానికి అత్యంత కఠినమైన నిబంధనలతో కూడిన కొత్త పార్కింగ్ పాలసీ ముసాయిదాను సిద్ధం చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన ఈ నూతన విధానం ప్రకారం రహదారులపై, నో-పార్కింగ్ జోన్లలో అడ్డగోలుగా నిలిపే వాహనాలతో పాటు, అకస్మాత్తుగా పాడైపోయి రోడ్డుపైనే ఉండిపోయే బ్రేక్డౌన్ వాహనాలను కూడా అధికారులు వెంటనే టోయింగ్ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక యార్డులకు తరలిస్తారు.
అలా స్వాధీనం చేసుకున్న వాహనాలను ముప్పై నుండి నలభై ఐదు రోజుల లోపు యజమానులు అన్ని రకాల బకాయిలు చెల్లించి క్లియిమ్ చేసుకోకపోతే, ప్రభుత్వం ఆ వాహనాలను నిస్సంకోచంగా బహిరంగ వేలం వేసి విక్రయిస్తుంది.
అయితే అధికారులు పట్టుకున్న వాహనాన్ని తిరిగి సొంతం చేసుకోవడం వాహనదారులకు అంత సులువు కాబోదు. సదరు యజమాని జరిమానాతో పాటు వాహనాన్ని తరలించినందుకు అయ్యే టోయింగ్ ఛార్జీలను, యార్డులో భద్రపరిచినందుకు గానూ రోజువారీ పార్కింగ్ ఫీజులను కూడా భరించాల్సి ఉంటుంది.
వీటితో పాటు సదరు వాహనంపై గతంలో ఉన్న అన్ని పాత ఈ-చలాన్లను పూర్తిగా క్లియర్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా రోడ్డు టాక్స్ బకాయిలు చెల్లించి, ప్రస్తుతానికి చెల్లుబాటులో ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ మరియు ఫిట్నెస్ సర్టిఫికేట్లను అధికారులకు సమర్పించిన తర్వాతే వాహనాన్ని అప్పగిస్తారు.
ఈ విధానం వల్ల భవిష్యత్తులో సొంత పార్కింగ్ స్థలం ఉన్నవారికే వాహనాలు కొనుగోలు చేసే అర్హత లభించేలా నిబంధనలు మారనున్నాయి.మరోవైపు ప్రభుత్వం కేవలం జరిమానాలకే పరిమితం కాకుండా, నగరాల్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి హైదరాబాద్ వంటి ప్రధాన రద్దీ ప్రాంతాల్లో, మెట్రో స్టేషన్ల వద్ద ఈవీ ఛార్జింగ్ సదుపాయాలతో కూడిన మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాలను పీపీపీ పద్ధతిలో నిర్మించాలని యోచిస్తోంది.
ప్రస్తుతం రవాణా శాఖ సిద్ధం చేసిన ఈ ముసాయిదా ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉంది. త్వరలోనే దీనిని అధికారిక వెబ్సైట్లో ఉంచి ప్రజల నుండి సూచనలు, అభ్యంతరాలను స్వీకరించిన తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా చట్టబద్ధంగా అమలు చేయనున్నారు.
#Sidhumaroju










