“తుర్కపల్లిలో భద్రతకు కొత్త బలం.. 22 సీసీ కెమెరాల ప్రారంభం”|

0
24

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి గ్రీన్ పార్క్ అవెన్యూలో భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన 22 కొత్త సీసీ కెమెరాలను ఆల్వాల్ డీఐ, వీరబాబు, సెక్టార్ ఎస్‌ఐ దేవేందర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడిన డీఐ వీరబాబు, “ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి కాలనీకి సీసీ కెమెరాలు అత్యంత అవసరం. నేరాలు జరిగిన తర్వాత విచారణలో మాత్రమే కాకుండా, నేరాలు జరగకుండా నిరోధించడంలో కూడా సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ అప్రమత్తంగా ఉంటే సమాజాన్ని మరింత సురక్షితంగా మార్చుకోవచ్చు” అని పేర్కొన్నారు.

ఇటీవలి ఘటనలను ప్రస్తావించిన అధికారులు, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను త్వరగా గుర్తించే అవకాశం ఉంటుందని, దీనివల్ల కాలనీల్లో భద్రతా వాతావరణం మరింత మెరుగుపడుతుందని తెలిపారు.

ప్రజల భాగస్వామ్యంతో కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేస్తున్నామని కూడా అధికారులు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో గ్రీన్ పార్క్ అవెన్యూ అధ్యక్షుడు మోహన్ సీతాకుమార్, కార్యదర్శి బెజుగం వెంకటేష్, ఖజాంచి రవి రాథోడ్‌తో పాటు కాలనీవాసులు పాల్గొని పోలీసుల చర్యలను అభినందించారు.

#Sidhumaroju

Alwal