జస్టిస్ లావు నాగేశ్వరరావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలుగువారైన జస్టిస్ లావు నాగేశ్వరరావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. లండన్లోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘హానరబుల్ సొసైటీ ఆఫ్ ది ఇన్నర్ టెంపుల్’ సంస్థ ఆయనను గౌరవ బెంచర్గా ఎంపిక చేసింది. 600 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థ న్యాయరంగం, ప్రజాసేవలో విశేష కృషి చేసిన అంతర్జాతీయ ప్రముఖులకు మాత్రమే ఈ గౌరవాన్ని అందిస్తుంది.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన ఆయన, హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేయకుండా నేరుగా బార్ నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా ఎంపికైన ఏడో న్యాయవాదిగా రికార్డు సృష్టించారు. 2016-2022 మధ్య అనేక చారిత్రక తీర్పులలో భాగస్వామిగా ఉన్న జస్టిస్ నాగేశ్వరరావుకు లభించిన ఈ గౌరవం తెలుగు వారికే కాక, భారత న్యాయవ్యవస్థకే గర్వకారణం.










