మచిలీపట్నంలో ఘనంగా ప్రభుత్వ రెండేళ్ల నమ్మకం, సంక్షేమం సభ|

0
0

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మచిలీపట్నంలో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా స్థాయి వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమ ప్రాంగణంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు, ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు గారికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి గారు, జిల్లా నాయకత్వం ఘన స్వాగతం పలికింది.

జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు, మంత్రి కొల్లు రవీంద్ర గారు ముఖ్య అతిథులుగా, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గారు విశిష్ట అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గారు, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ గారు, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు గారు, కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి గారు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారి సమన్వయంతో ప్రజలకు ఇచ్చిన హామీలలో అత్యధిక భాగం అమలు చేశామని పేర్కొన్నారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, దీపం-2, అన్నదాత సుఖీభవ, యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, తాగునీటి ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తున్నాయని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు వివరించారు. అనంతరం జిల్లా పరిధిలోని 29,275 డ్వాక్రా సంఘాలకు రూ.2,975 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు.