“నేరానికి ముందే చెక్.. పిస్టల్స్‌తో పట్టుబడ్డారు!|

0
8

“మైలార్‌దేవ్‌పల్లిలో ప్రత్యేక ఆపరేషన్ విజయవంతం: డీసీపీ వైభవ్ గైక్వాడ్”

సికింద్రాబాద్ : హైదరాబాద్‌ లో నేరాలకు పాల్పడేందుకు సిద్ధమవుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

వారి వద్ద నుంచి రెండు దేశీయ తయారీ పిస్టల్స్, 7 బుల్లెట్లు, ఒక బాలెనో కారు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ వెల్లడించారు.

సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులతో కలిసి చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ముదస్సిర్ హుస్సేన్ అలియాస్ షా బాబా (24), అమీర్ ఖాన్ (26)లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

అరెస్టైన ముదస్సిర్ హుస్సేన్ హైదరాబాద్‌కు చెందిన కార్ల వ్యాపారి కాగా, అమీర్ ఖాన్ మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన లారీ డ్రైవర్‌గా గుర్తించారు. నిందితుల వద్ద నుంచి రెండు దేశీయ పిస్టల్స్, 7 బుల్లెట్లు, TS23F1701 నంబర్ గల బాలెనో కారు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.

విచారణలో ముదస్సిర్ హుస్సేన్ గతంలో ముంబైలో పనిచేసి అనంతరం వాహనాల కొనుగోలు, విక్రయాల వ్యాపారంలోకి ప్రవేశించినట్లు తేలింది. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన నేరచరిత్ర కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని దోపిడీలు, అపహరణలు వంటి నేరాల్లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.

కర్ణాటకలో జరిగిన దోపిడీ కేసుతో పాటు మహారాష్ట్రలో ఓ వ్యాపారవేత్త అపహరణ కేసులో కూడా అతని ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు.

అమీర్ ఖాన్‌పై కూడా మహారాష్ట్రలో పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. విశ్వసనీయ సమాచారం మేరకు మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో బాలెనో కారులో సంచరిస్తూ నేరానికి యత్నిస్తున్నారని తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ బృందం మెహ్ఫిల్ హోటల్ సమీపంలో వాహనాన్ని అడ్డగించి ఇద్దరిని పట్టుకుంది.

ముదస్సిర్ హుస్సేన్‌పై కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో దోపిడీ, ఆయుధాల చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు నమోదై ఉండగా, అమీర్ ఖాన్‌పై మహారాష్ట్రలో పలు కేసులతో పాటు తెలంగాణలో కూడా ఒక కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఆపరేషన్‌ను జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ యాదేందర్, ఎస్‌ఐ మొహమ్మద్ జాహెద్, వారి సిబ్బంది మైలార్‌దేవ్‌పల్లి పోలీసుల సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ తెలిపారు.

#Sidhumaroju