తెలంగాణలో నేటి నుంచి ఇంటింటి ఓటరు సర్వే ప్రారంభం
తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు) ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులు నమోదు చేయనున్నారు.
సగటున ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఒక బీఎల్ఓను నియమించిన ఎన్నికల అధికారులు, ప్రతి ఇంటికి అవసరమైతే మూడుసార్లు వరకు వెళ్లి వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇంట్లో ఎవరూ అందుబాటులో లేకపోయినా మళ్లీ సందర్శించి వివరాలు నమోదు చేయనున్నారు.
ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ప్రజలు బీఎల్ఓలకు సహకరించి సరైన వివరాలు అందించాలని, అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు.









