జేబీఎస్ వేదికగా యాంటీ డ్రగ్ సందేశం.|

0
0

“జేబీఎస్‌లో పోలీసుల వినూత్న కార్యక్రమం.. భారీగా పాల్గొన్న ప్రజలు”

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ (JBS)లో డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ ఉద్యోగులు, సాధారణ ప్రజలు పాల్గొని మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి తమ మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమానికి  మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, బేగంపేట్ ఏసీపీ గోపాలకృష్ణ హాజరై మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. యువతతో పాటు ప్రతి పౌరుడు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, సమాజాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

అనంతరం డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు జూబ్లీ బస్ స్టేషన్ పరిసరాల్లో అవగాహన ర్యాలీ చేపట్టారు.

ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మాదకద్రవ్యాలపై పోరాటంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అధికారులు పేర్కొనగా, ఈ కార్యక్రమాన్ని మారేడ్‌పల్లి ఎస్‌హెచ్‌ఓ వెంకటేష్ సమన్వయం చేశారు.

–Sidhumaroju