ఈటెల ఏమన్నారంటే..!

0
5

“రంగారెడ్డి నగర్‌లో శివాజీ విగ్రహావిష్కరణలో ఎంపీ ఈటెల రాజేందర్.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని పిలుపు”

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రంగారెడ్డి నగర్‌లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించారు.

భారతదేశం ఒకప్పుడు ప్రపంచానికి విశ్వగురువుగా నిలిచిందని, ఆ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కృషి చేస్తోందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేయడంలో మోదీ కీలక పాత్ర పోషించారని అన్నారు.

ఛత్రపతి శివాజీ భారతమాత ముద్దుబిడ్డ అని, ఆయన ధైర్యసాహసాలు, దేశభక్తి, కట్టుబాటు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కొనియాడారు. అన్ని మతాలను సమానంగా గౌరవించిన మానవతావాదిగా శివాజీ చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు.

ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ సంస్కృతి, సంప్రదాయాలు, ఆలయాల పరిరక్షణకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఇతిహాసాలు, మానవ సంబంధాలు ప్రపంచం ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోతాయని ఈటల అన్నారు. భారతదేశ ఆధ్యాత్మిక శక్తిని గుర్తించిన అనేక దేశాలు ఇప్పుడు భారత్‌ను అనుసరిస్తున్నాయని, ప్రపంచానికి భారతదేశం మార్గదర్శిగా నిలిచే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.

రంగారెడ్డి నగర్‌లో స్థానికులు ఎదుర్కొంటున్న రోడ్ల సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. గత 12 సంవత్సరాలుగా మోదీ పాలనను చూసిన అనంతరం దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు భారతీయ జనతా పార్టీ పాలనను కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే, గత వైభవాన్ని తిరిగి సాధించాలంటే రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని, అందుకు అనుగుణంగా ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు.

ఈకార్యక్రమంలో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ యాదవ్, బాచుపల్లి కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు, వినాయక్‌నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి భరత్ సింహారెడ్డి, గాజులరామారం కార్పొరేటర్ శేషగిరిరావు, సీనియర్ నాయకులు నంద నందివాకర్, కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు భానుక నర్మద మల్లికార్జున్, కంటోన్మెంట్ వైస్ ప్రెసిడెంట్ బి.ఎన్. శ్రీనివాస్, రంగారెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షుడు మణికంఠతో పాటు పలువురు బీజేపీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#Sidhumaroju