“హస్మత్పేట్ ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం. ”
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: హైడ్రా మరోసారి కూల్చివేతల చర్యలను వేగవంతం చేసింది. ఆల్వాల్ మండల పరిధిలోని హస్మత్పేట్ చత్రిగడ్డ సర్వే నెం.1లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను ఆదివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య తొలగిస్తోంది.
స్థానిక పోలీసులతో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) సిబ్బంది మోహరించగా, జేసీబీల సహాయంతో కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వ పురావస్తు శాఖకు చెందిన సుమారు 10 ఎకరాలకు పైగా ఉన్న భూమిని కొందరు ఆక్రమించి, నోటరీ పత్రాల ఆధారంగా ప్లాట్లుగా విభజించి విక్రయాలు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా అధికారులు రంగంలోకి దిగినట్లు సమాచారం.
ఆక్రమిత స్థలంలో నిర్మించిన నిర్మాణాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చే ప్రక్రియ చేపట్టారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించగా, అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
కూల్చివేతల అనంతరం ప్రభుత్వ భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేసి, ఈ స్థలం ప్రభుత్వానికి చెందినదని తెలియజేస్తూ నోటీసులు, ‘ట్రెస్పాస్ నిషేధం’ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ప్రజా ఆస్తులను ఆక్రమించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హైడ్రా అధికారులు హెచ్చరించారు.
#Sidhumaroju
Alwal










