హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.|

0
9

“ప్రజా సమస్యల పరిష్కారమే విజయానికి మార్గమని కార్యకర్తలకు ఈటల రాజేందర్ దిశానిర్దేశం”

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జులై 7: భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో రానున్న హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలే ప్రధాన అజెండాగా నిలిచాయి.

సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ, ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసినప్పుడే ఎన్నికల్లో విజయం సాధించగలమని అన్నారు.

హైదరాబాద్  పరిధిలో కాషాయ జెండా ఎగరాలంటే ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ప్రజల మధ్య ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కేవలం ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వెళితే విజయాన్ని ఆశించలేమని స్పష్టం చేశారు. ప్రజా సంబంధాలే నాయకులకు అసలైన కొలమానమని, పార్టీ జెండానే ప్రతి కార్యకర్తకు గౌరవాన్ని, గుర్తింపును తీసుకొస్తుందని పేర్కొన్నారు.

తాను ఎంపీగా ఎన్నికైన తర్వాత ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కార్పొరేటర్లకు అభివృద్ధి పనుల కోసం నిధులు అందేలా కృషి చేశానని ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే స్థానిక నాయకత్వం మరింత బలోపేతం కావాలని, ప్రజల ప్రేమను పొందే నాయకులుగానే ఎదగాలని సూచించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రస్తావిస్తూ, సేవా దృక్పథంతో పనిచేసే నాయకత్వమే భారతీయ జనతా పార్టీ బలమని అన్నారు. మోదీ ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని, ఆయన పనితీరును ఆదర్శంగా తీసుకుని ప్రతి కార్యకర్త ప్రజల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర రాజకీయాలపై కూడా ఆయన స్పందించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైతే ఏ ప్రభుత్వమైనా ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందని వ్యాఖ్యానించారు.

కార్యకర్తలు ప్రతికూల ప్రచారానికి దూరంగా ఉండి, ప్రజల సమస్యల పరిష్కారంపైనే దృష్టి సారించాలని సూచించారు.

ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డితో పాటు రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

# Sidhumaroju