అక్రమ బియ్యం దందాకు బ్రేక్.. పీడీ చట్టంతో చెక్.|

0
11

● పలుమార్లు కేసులు నమోదైన వ్యక్తిపై నిర్బంధ ఉత్తర్వులు

● అల్వాల్ పోలీసుల చర్యలు.. చర్లపల్లి జైలుకు తరలింపు

మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 22: ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యం అక్రమ రవాణా కేసుల్లో పదేపదే నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిపై అల్వాల్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి ఆదేశాల మేరకు హస్మత్‌పేట్‌కు చెందిన మంగళ్ సింగ్‌పై పీడీ యాక్ట్ (Preventive Detention Act) కింద నిర్బంధ ఉత్తర్వులు అమలు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్ తెలిపారు.

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళ్ సింగ్‌పై నిత్యావసర వస్తువుల చట్టం (Essential Commodities Act) కింద పలు కేసులు నమోదయ్యాయి.

ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యాన్ని అక్రమంగా సేకరించడం, నిల్వ చేయడం, రవాణా చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించారు.

ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వరుస నేరాలకు పాల్పడుతున్న నేపథ్యంలో చట్టపరమైన చర్యల్లో భాగంగా పీడీ యాక్ట్ అమలు చేశారు. అనంతరం మంగళ్ సింగ్‌ను చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు.

ప్రజా పంపిణీ వ్యవస్థను రక్షించడం, అక్రమ కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా అలవాటు పడిన నేరస్థులపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్‌హెచ్‌ఓ  తెలిపారు.

#Sidhumaroju

Alwal