ఫీజు బకాయిలపై బీజేపీ యువ మోర్చా పోరుబాట.|

0
17

● పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్.

● ఈటల రాజేందర్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ.

● ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం.

మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 25: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.

ఇందులో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు రాగం అర్జున్ ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు.

మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పోస్టర్‌ను ఆవిష్కరించి ఉద్యమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా నిరంతరం పోరాటం కొనసాగిస్తాయని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

రాగం అర్జున్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారమే బీజేవైఎం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీను, మాజీ జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి వరప్రసాద్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే బీజేపీ, బీజేవైఎం జిల్లా, మండల, శక్తికేంద్ర, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

“ఈ పోస్టర్ విడుదల కార్యక్రమం విద్యార్థి సమస్యలపై పార్టీ కట్టుబాటును మరోసారి చాటిచెప్పింది”

#Sidhumaroju

Alwal