సబ్సిడీ లోన్ పేరిట వల.. లక్షల్లో డీల్, బైక్‌తో పరార్!

0
2

– వెల్డింగ్ కార్మికుడికి రూ. 30 వేలు టోకరా.. 
– గంగారం MPDO ఆఫీస్ అటెండర్‌పై బాధితుడి పోలీసు ఫిర్యాదు

Mahabubabad: ప్రభుత్వ సబ్సిడీ లోన్ ఇప్పిస్తానంటూ నమ్మబలికి ఓ అమాయక కార్మికుడిని ఘోరంగా మోసగించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో వెలుగు చూసింది. రూ. 30 వేల నగదుతో పాటు బాధితుడి కొత్త బైక్‌ను కూడా ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

కొత్తగూడ మండల కేంద్రంలో బిలాల్ అనే వ్యక్తి వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలానికి చెందిన జక్కుల మహేష్ అనే వ్యక్తి బిలాల్‌కు పరిచయమయ్యాడు. తనకు ప్రభుత్వ సబ్సిడీ లోన్ మంజూరు చేయిస్తానని, అందుకోసం రూ. లక్ష కమిషన్ ఇవ్వాలని నమ్మబలికాడు. మహేష్ మాటలను నిజమని నమ్మిన బిలాల్.. అడ్వాన్స్‌గా రూ. 30,000 నగదును చెల్లించాడు.నగదు తీసుకున్న తర్వాత కేటుగాడు మహేష్ తన బుద్ధి చూపించాడు. లోన్ మంజూరైందని కట్టుకథలు చెప్పి బిలాల్‌కు చెందిన కొత్త బైక్‌ను బలవంతంగా తీసుకెళ్లాడు. ఒప్పందం ప్రకారం మిగతా డబ్బులు పూర్తిగా ఇస్తేనే బైక్ తిరిగి ఇస్తానని, లేకపోతే ఇవ్వనని బెదిరింపులకు దిగాడు. బాధితుడు ఎంత వేడుకున్నా వినకుండా బైక్‌తో పరారయ్యాడు.

బాధితుడిని మోసం చేసిన జక్కుల మహేష్ ప్రస్తుతం గంగారం మండలం MPDO కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తూ ఇలా అమాయక ప్రజలను మోసగించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాను మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన బాధితుడు బిలాల్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో జక్కుల మహేష్‌పై ఫిర్యాదు చేశాడు. నిందితుడి వద్ద నుంచి తన రూ. 30,000 నగదుతో పాటు బైక్‌ను రికవరీ చేసి ఇప్పించాలని, అమాయకులను మోసం చేస్తున్న నిందితుడిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.