పంట కోత మాటున.. బంగారు గొలుసుల కోత.|

0
5

● వృద్ధ మహిళలనే లక్ష్యంగా చేసుకున్న అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా

● ముగ్గురు అరెస్ట్.. 8 తులాల బంగారం, బైక్, కత్తులు స్వాధీనం

● మరో చోరీ కేసులో 18 తులాల బంగారం, 7 తులాల వెండి రికవరీ

హైదరాబాద్ (ఫ్యూచర్ సిటీ), జూలై 29: వరి కోత హార్వెస్టర్ ఆపరేటర్ల ముసుగులో గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తూ వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన పంజాబ్‌కు చెందిన అంతర్రాష్ట్ర ముఠాను కేశంపేట్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసు వివరాలను ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి బుధవారం షాద్‌నగర్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం, పంజాబ్‌కు చెందిన సుఖ్‌దేవ్ సింగ్ (38), షంషేర్ సింగ్ (36), మనుప్రీత్ సింగ్ (24) పంటల సీజన్‌లో హార్వెస్టర్ ఆపరేటర్లుగా పనిచేస్తూ వివిధ గ్రామాల్లో సంచరించేవారు. స్థానిక ప్రాంతాలపై పూర్తి అవగాహన పెంచుకున్న అనంతరం, కూలి పనులకు కాలినడకన వెళ్తున్న వృద్ధ మహిళల వద్దకు బైక్‌పై వెళ్లి దారి అడుగుతున్నట్లు నటించి వారి మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లేవారు. ఓ ఘటనలో మహిళను కిందకు తోసివేసి మూడు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించినట్లు దర్యాప్తులో గుర్తించారు.

దర్యాప్తులో ముఠా ముందుగా మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో మోటార్‌సైకిల్ దొంగిలించి, అదే వాహనంతో నేరాలకు పాల్పడినట్లు తేలింది.

అనంతరం నాందేడ్‌లో సమావేశమై తెలంగాణలో మరిన్ని చైన్ స్నాచింగ్‌లకు ప్రణాళిక రూపొందించింది. అక్కడి నుంచి సికింద్రాబాద్ చేరుకుని మరో బైక్ చోరీ చేసి కేశంపేట్, కడ్తాల్ ప్రాంతాల్లో వరుస ఘటనలకు పాల్పడింది. మరో నేరానికి సిద్ధమవుతుండగా పక్కా సమాచారంతో కేశంపేట్ క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వద్ద నుంచి సుమారు 8 తులాల బరువున్న రెండు బంగారు మంగళసూత్రాలు, ఒక మోటార్‌సైకిల్, ఐదు మొబైల్ ఫోన్లు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా,  షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మరో ఇంటి చోరీ కేసును కూడా ఛేదించినట్లు కమిషనర్ తెలిపారు. ఆ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 18 తులాల బంగారం, 7 తులాల వెండి, రూ.30 వేల నగదును రికవరీ చేశారు. అలాగే పలు వాహన చోరీ కేసులను ఛేదించి మూడు మోటార్‌సైకిళ్లను కూడా రికవరీ చేసుకున్నారు.

ఆస్తి సంబంధిత నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డా. తరుణ్ జోషి సూచించారు. ప్రతి కాలనీ, వీధిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాల నియంత్రణకు సహకరించాలని కోరారు.

కేసులను ఛేదించిన డీసీపీ శిరీష రాఘవేందర్, షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, కేశంపేట్ సీఐ నరహరి, ఎస్సై రాజ్‌కుమార్‌తో పాటు దర్యాప్తు బృందాన్ని అభినందించారు.

#Sidhumaroju