● ఒకే వేదికపై 288 మంది నిందితులకు అవగాహన కార్యక్రమం
● సన్మార్గం ఎంచుకుంటే నైపుణ్యాభివృద్ధి, ఉపాధికి పోలీసుల సహకారం
● అలవాటైన నేరాలకు చెక్.. మార్పు లేకపోతే కఠిన చట్టాల అమలు
హైదరాబాద్, జూలై 31: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అలవాటుపడిన నేరస్థుల్లో శాశ్వత మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో హైదరాబాద్ సిటీ పోలీస్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
పేట్లబుర్జులోని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (CTC)లో ఒకేసారి 288 మంది సెల్ఫోన్ చోరీ కేసుల నిందితులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. అదనపు సీపీ శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, చోరీలను శాశ్వతంగా విడిచిపెట్టి నిజాయితీతో జీవనం సాగించాలని నిందితులకు సూచించారు.
తరచూ జైలు శిక్షలు అనుభవించడం కంటే సన్మార్గాన్ని ఎంచుకుని కుటుంబాలతో కలిసి గౌరవప్రదమైన జీవితం గడపాలని పిలుపునిచ్చారు.
చదువు మధ్యలో ఆపేసిన వారు, ఉపాధి అవకాశాలు లేని వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందించి, ఉద్యోగం లేదా స్వయం ఉపాధి కల్పించేందుకు పోలీస్ శాఖ సహకరిస్తుందని తెలిపారు. సమాజంలో తిరిగి స్థిరపడేందుకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
అయితే, ఈ అవకాశాన్ని వినియోగించుకోకుండా మళ్లీ చోరీలకు పాల్పడే అలవాటైన నేరస్థులపై పీడీ యాక్ట్తో పాటు ఇతర కఠిన చట్టాల కింద చర్యలు తప్పవని హెచ్చరించారు.
కేవలం కేసులు నమోదు చేసి జైలుకు పంపడమే కాకుండా, నేరాలకు దారితీసే పరిస్థితులను తగ్గించి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులతో పాటు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
#Sidhumaroju










