● కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు
● నోటీసులు లేకుండా ప్రైవేట్ ఆస్తిలోకి వెళ్లడంపై ఆగ్రహం
● చట్టపాలనకు విరుద్ధంగా వ్యవహరించరాదని ధర్మాసనం వ్యాఖ్యలు
హైదరాబాద్, జూలై 31: కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వ్యవహారంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆయన స్థానంలో ఐజీ ర్యాంక్కు చెందిన సమర్థుడైన అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది.
సికింద్రాబాద్ లోతుకుంట పరిధిలోని సుమారు 40 ఎకరాల వివాదాస్పద స్థలానికి సంబంధించి శాంతాశ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
గతంలో హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు అమల్లో ఉండగానే, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అధికారులు యంత్రాలు, సిబ్బందితో ప్రైవేట్ ఆస్తిలోకి ప్రవేశించడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది.
ఈ సందర్భంగా ధర్మాసనం చట్టపాలన ప్రాధాన్యతను వెల్లడించింది.
సమాజంలో వ్యక్తుల ఆధిపత్యం పెరిగితే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని పేర్కొంది.
హైడ్రా కమిషనర్పై తక్కువ వ్యవధిలోనే దాదాపు 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదైన అంశంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ వ్యవహారంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ కోర్టుకు బేషరతు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ సమర్పించినప్పటికీ, ఉన్నత స్థాయి అధికారి పదేపదే నిబంధనలు ఉల్లంఘించడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంటూ ధర్మాసనం క్షమాపణలను తిరస్కరించింది.
ఈ నేపథ్యంలో కమిషనర్ బదిలీకి సంబంధించి హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా, తదుపరి విచారణను వాయిదా వేసింది.
#Sidhumaroju










