డాక్టర్ దందా.. పోలీసుల పంజా.|

0
10

● సూరారం–ఎస్‌వోటీ కుత్బుల్లాపూర్ సంయుక్త ఆపరేషన్

● వైద్య అర్హతలు, లైసెన్స్ లేకుండానే ఏడాదిగా చికిత్స

● నిందితుడిపై కేసు నమోదు.. ప్రజలకు పోలీసుల హెచ్చరిక

మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఆగస్టు 1: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సూరారంలో నకిలీ క్లినిక్ నిర్వహిస్తున్న బోగస్ డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

సూరారం ఎస్‌హెచ్‌ఓ కే. బాలరాజు వివరాల ప్రకారం, విశ్వసనీయ సమాచారం మేరకు సూరారం పోలీసులు, ఎస్‌వోటీ కుత్బుల్లాపూర్ బృందం సంయుక్తంగా వెంకటరామ్‌నగర్‌లో బచ్‌పన్ స్కూల్ సమీపంలోని ‘రక్షిత క్లినిక్’  పై ఆకస్మిక దాడి నిర్వహించారు.

తనను తాను డాక్టర్‌గా పరిచయం చేసుకుంటూ క్లినిక్ నడుపుతున్న సనాది కర్ణాకర్ (35)ను అదుపులోకి తీసుకున్నారు.

అతను మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నప్పటికీ, చెల్లుబాటు అయ్యే వైద్య విద్యార్హతలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, వైద్య వృత్తికి అవసరమైన లైసెన్స్ ఏదీ లేకుండానే గత ఏడాది కాలంగా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

రోగులను పరీక్షించి మందులు అందించడంతో పాటు కన్సల్టేషన్ ఫీజులు, ఔషధాల పేరుతో డబ్బులు వసూలు చేసి అక్రమ లాభాలు పొందుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

నిందితుడిని సూరారం పోలీస్ స్టేషన్‌కు తరలించి సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.

వైద్య సేవలు పొందే ముందు సంబంధిత వైద్యుడికి చెల్లుబాటు అయ్యే అర్హతలు, రిజిస్ట్రేషన్, లైసెన్స్ ఉన్నాయో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

పరిసర ప్రాంతాల్లో నకిలీ వైద్యులు లేదా అక్రమంగా క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

#Sidhumaroju