● జవహర్నగర్ డంప్యార్డ్కు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరిన ఈటల రాజేందర్
● జీరో పొల్యూషన్తో వ్యర్థాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ
మేడ్చల్ మల్కాజిగిరి న్యూఢిల్లీ, ఆగస్టు 5: జవహర్నగర్ డంప్యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. పార్లమెంట్ ప్రాంగణంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ అంశంపై కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు వివరించారు.
హైదరాబాద్ జనాభా సుమారు 30 లక్షలుగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన జవహర్నగర్ డంప్యార్డ్లో ప్రస్తుతం దాదాపు రెండు కోట్ల జనాభా నుంచి వచ్చే చెత్తను ఒకేచోట డంప్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
దీంతో చెత్త గుట్టలు భారీగా పేరుకుపోయి, సుమారు 40 కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రజలు దుర్వాసన, వాయు కాలుష్యం, నీటి కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కాలుష్య ప్రభావంతో లక్షలాది మంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, సంపాదించిన ఆదాయంలో పెద్ద భాగం వైద్య ఖర్చులకే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈటల రాజేందర్ అన్నారు. రోజుకు దాదాపు 10 వేల మెట్రిక్ టన్నుల చెత్తను ఒకేచోట వేయడం సమంజసం కాదని కేంద్ర మంత్రికి వివరించినట్లు చెప్పారు.
జీరో పొల్యూషన్ విధానంలో వ్యర్థాలను శాస్త్రీయంగా రీసైక్లింగ్ చేయడంతో పాటు, భవిష్యత్తులో ఒక్క కిలో చెత్త కూడా అక్కడ డంప్ కాకుండా ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఢిల్లీలో అమలు చేస్తున్న ఆధునిక వ్యర్థాల నిర్వహణ విధానాలను హైదరాబాద్లోనూ అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
జవహర్నగర్లో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సామర్థ్యం రోజుకు 3,500 మెట్రిక్ టన్నులు మాత్రమే కాగా, అక్కడికి దాదాపు 10 వేల మెట్రిక్ టన్నుల చెత్త చేరుతోందని అభిప్రాయపడ్డారు.
ఆ కేంద్రం సమర్థంగా పనిచేస్తుందో లేదో కూడా పర్యవేక్షణ లేదని విమర్శించారు.
జవహర్నగర్ డంప్యార్డ్ సమస్యపై తాను సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని, అప్పట్లో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ సమస్యకు ఇప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
#sidhumaroju
Alwal










