గతేడాది వేలంలో గణేశ్ లడ్డూను భారీ మొత్తానికి దక్కించుకున్నాడు. దాంతో అక్కడ ధనవంతుడిగా గుర్తింపు పొందాడు. అపార్టుమెంటు వాసులకు లడ్డూ పంచాడు. ఆ పరిచయాలతో పలువురి వద్ద డబ్బులు వసూలు చేసి.. చెప్పాపెట్టకుండా అక్కడి నుంచి చెక్కేశాడు. అధిక లాభాల ఆశతో పెట్టుబడిపెట్టి మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యవహారం ఏటా వేలంలో గణేశుడి లడ్డూని భారీ ధరకు అమ్మి వార్తల్లో నిలిచే మైహోం భూజలో జరిగింది.
కొండపల్లి గణేశ్ అనే వ్యక్తి మైహోం భూజలో ఉంటున్నాడు. గతేడాది సెప్టెంబర్లో వినాయక ఉత్సవాల సందర్భంగా లడ్డూ వేలం నిర్వహించగా గణేశ్ రూ.51 లక్షలకు దక్కించుకున్నాడు. దీంతో స్థానికంగా ధనవంతుడనే పేరు తెచ్చుకున్నాడు. వేలంలో దక్కించుకున్న లడ్డూని అపార్టుమెంట్ల సముదాయంలోని నివాసితులకు లడ్డూ పంచాడు. ఈ క్రమంలో బోయిన్పల్లి కిరణ్ ద్వారా అందులోనే ఉండే సిల్వియా, ఆమె భర్త శ్రీనివాసరెడ్డితో గణేశ్కు పరిచయమైంది.
తాము వ్యాపారం ప్రారంభింస్తున్నామని, అందులో పెట్టుబడి పెడితే నెలకు 6 శాతం చొప్పున లాభం ఇస్తామని వారికి చెప్పారు. దీంతో గణేశ్, కిరణ్ మాటలను నమ్మిన సిల్వియా దంపతులు తొలుత రూ.31 లక్షలు పంపారు. కొన్ని రోజుల తర్వాత లాభం గురించి అడగడంతో వాయిదా వేస్తూ వచ్చారు. అనంతరం ఫోన్లు చేసినా స్పందించకపోయేవారు. ఈక్రమంలో గత ఏప్రిల్లో గణేశ్, కిరణ్ ఇద్దరూ మైహోం భూజలోని నివాసాలను చెప్పాపెట్టకుండా ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆరా తీయగా తమలాగే మరికొందర్ని కూడా మోసంచేసినట్లు తేలింది. మొత్తంగా ఐదుగురి నుంచి రూ.3.45 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో (EOW)కేసు నమోదుచేసి.. దర్యాప్తు చేస్తున్నారు.






