Madanapalle: అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను ప్రకటించి దాదాపు తొమ్మిది నెలలు గడిచినా, ఇప్పటికీ అనేక జిల్లా స్థాయి కార్యాలయాలు పూర్తిస్థాయిలో మదనపల్లెలో పనిచేయకపోవడం విచారకరమని బహుజన యువసేన (BYS) రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ అన్నారు. శుక్రవారం బహుజన యువసేన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ జిల్లా కార్యాలయం ఇప్పటికీ రాయచోటిలోనే కొనసాగుతోందని, ఆర్టీఓ జిల్లా కార్యాలయాన్ని కూడా రాయచోటికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
అలాగే బీసీ హాస్టల్ను కూడా రాయచోటికి తరలించే చర్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. జిల్లాకు సంబంధించిన దాదాపు 20 నుంచి 25 కార్యాలయాలు ఇంకా మదనపల్లెలో ఏర్పాటు కాకపోవడం ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తోందన్నారు. మదనపల్లెలో ఉన్న కొన్ని జిల్లా కార్యాలయాలకు అధికారులు ప్రతిరోజూ హాజరుకాకుండా వారానికి ఒకసారి మాత్రమే వస్తుండగా, మరికొందరు అధికారులు రాయచోటిలోనే విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయని చెప్పారు.
జిల్లా కేంద్రంగా మదనపల్లెను ప్రకటించినప్పుడు పరిపాలనా వికేంద్రీకరణ లక్ష్యంగా చెప్పారని, అయితే జిల్లా స్థాయి కార్యాలయాలు మదనపల్లెలో లేకపోవడం వల్ల జిల్లా కేంద్ర హోదా లక్ష్యం నెరవేరడం లేదన్నారు. మదనపల్లెలోనే అన్ని జిల్లా స్థాయి కార్యాలయాలను ఏర్పాటు చేసి, అధికారులు క్రమం తప్పకుండా విధులకు హాజరయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పునీత్ కుమార్ డిమాండ్ చేశారు.










