● పదో తరగతి బాలుడిని గదిలో బంధించి కర్రలతో కొట్టినట్లు ఆరోపణలు
● మెట్లపై నుంచి పడిపోయాడంటూ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన సిబ్బంది
● తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న అభిషేక్.. బాధ్యులపై చర్యలకు కుటుంబం డిమాండ్
మేడ్చల్ మల్కాజిగిరి, ఆగస్టు 10: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దమ్మాయిగూడలో శ్రీచైతన్య పాఠశాల హాస్టల్లో పదో తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది.
కామారెడ్డికి చెందిన అభిషేక్ను పాత కక్షల నేపథ్యంలో హాస్టల్ గదిలో బంధించి, కర్రలతో కొట్టడంతో పాటు బూట్లతో ముఖంపై తొక్కినట్లు అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనలో బాలుడి శరీరంపై తీవ్ర గాయాలు, వాతలు ఏర్పడినట్లు వారు తెలిపారు.
ప్రస్తుతం కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అభిషేక్ చికిత్స పొందుతున్నాడు. శనివారం రాత్రి జరిగిన ఘటనపై తల్లిదండ్రులకు ఫోన్ చేసిన పాఠశాల సిబ్బంది.. బాలుడు మెట్లపై నుంచి కిందపడి గాయపడ్డాడని చెప్పినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
పాఠశాలకు చేరుకున్న వారు అతని ఒంటిపై ఉన్న గాయాలను చూసి ప్రశ్నించడంతో దాడి విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.
రాత్రివేళ హాస్టల్ గదిలో ఇంతటి ఘటన చోటుచేసుకునే వరకు వార్డెన్లు, భద్రతా సిబ్బంది గుర్తించకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విద్యార్థుల మధ్య నెలకొన్న విభేదాలను ముందుగానే గుర్తించి నివారించడంలో పర్యవేక్షణ లోపించిందా అనే అంశంపైనా విచారణ జరపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, ఘటనపై పాఠశాల యాజమాన్యం వ్యవహరించిన తీరును కూడా పరిశీలించాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
హాస్టల్లో విద్యార్థుల భద్రతకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు సమగ్రంగా విచారణ జరపాలని కోరుతున్నారు.
#sidhumaroju
Alwal










