తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ.|

0
0

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, క్యూలైన్లు వెలుపలి వరకు విస్తరించాయి. పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం దర్శనానికి సంబంధించి బుధవారం జారీ చేయాల్సిన సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్ల జారీని నిలిపివేసింది.

 

ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు ఈ మార్పును గమనించి, తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలోని కౌంటర్ల వద్దకు రావొద్దని సూచించారు. టోకెన్ల కోసం వేచి చూడకుండా నేరుగా తిరుమలకు చేరుకుని సర్వదర్శనం క్యూలైన్లలోకి ప్రవేశించాలని కోరారు. అయితే, శుక్రవారం దర్శనం కోసం గురువారం యథావిధిగా టోకెన్ల జారీ ఉంటుందని స్పష్టం చేశారు.

 

మంగళవారం రోజున మొత్తం 78,956 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 31,014 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా రూ. 4.46 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి.