Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ ఎస్సై గాయత్రి ఆధ్వర్యంలో సిబ్బంది పట్టణంలోని పలు ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఒకే ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించడం (ట్రిపుల్ రైడింగ్), డ్రంక్ అండ్ డ్రైవ్ తదితర ఉల్లంఘనలను గుర్తించి వాహనదారులకు జరిమానాలు విధించారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం వంటి చర్యలతో ప్రమాదాల ముప్పు పెరుగుతుందని పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పించారు.
ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపవద్దని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని ఎస్సై గాయత్రి సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిరంతరం తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.










