● అల్వాల్లో ఘనంగా 82వ జయంతి వేడుకలు
● గోల్నాక చౌరస్తాలో విగ్రహానికి పూలమాలలు
● రాజీవ్ గాంధీ సేవలను స్మరించిన తోట లక్ష్మీకాంత్ రెడ్డి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఆగస్టు 20: మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ 82వ జయంతిని పురస్కరించుకుని అల్వాల్ గోల్నాక చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి తోట లక్ష్మీకాంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని ఆధునికత వైపు నడిపించడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని అన్నారు. కంప్యూటర్, టెలికమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి ఆయన తీసుకున్న చర్యలు దేశంలో సాంకేతిక పురోగతికి బలమైన పునాది వేశాయని పేర్కొన్నారు.
యువతను ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం ఆయన తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక పాలనను బలోపేతం చేయడానికి పంచాయతీరాజ్ వ్యవస్థకు ప్రాధాన్యత కల్పించారని గుర్తు చేశారు.
దేశ భవిష్యత్తుపై రాజీవ్ గాంధీకి ఉన్న దూరదృష్టి, యువతపై ఆయన ఉంచిన విశ్వాసం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal










