కల్వర్టు అనుమతికి లంచం.. రెడ్ హ్యాండెడ్‌గా ఇరిగేషన్ అధికారులు!

0
1

నెల్లూరు జిల్లాలో ముగ్గురు నీటిపారుదల శాఖ అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక రైతు నుంచి రూ. 3 లక్షలు లంచం స్వీకరిస్తుండగా ఈఈ మహేశ్, డీఈ గౌతమ్ సుమన్, ఏఈ నారాయణరాజులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 

వివరాల్లోకి వెళితే.. కలువాయి మండలం మద్దూరుపల్లి గ్రామానికి చెందిన రైతు అంబటి చిరంజీవి, తన పొలం వద్ద గల కాలువపై కల్వర్టు నిర్మించుకునేందుకు అనుమతి (ఎన్ఓసీ) కోసం నీటిపారుదల శాఖ అధికారులను సంప్రదించారు. అయితే, ఆ ఎన్ఓసీ జారీ చేసేందుకు సదరు అధికారులు రూ. 4 లక్షలు లంచంగా డిమాండ్ చేశారు.

 

దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి వ్యూహం ప్రకారం, గురువారం బాధితుడి నుంచి రూ. 3 లక్షలు నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి ముగ్గురు అధికారులను పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు తదుపరి విచారణ చేపట్టారు. ఈ ఘటన జిల్లా నీటిపారుదల శాఖలో తీవ్ర కలకలం రేపింది.