చింతూరు డివిజన్ పరిధిలోని గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించేందుకు మరో కీలక ముందడుగు పడింది. అరకు పార్లమెంట్ సభ్యురాలు గౌరవ శ్రీమతి తనుజారాణి, ఎంపీ గ్రాంట్ నిధుల ద్వారా చింతూరు సీహెచ్సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) ఆసుపత్రికి నూతన అంబులెన్స్ను సమకూర్చారు. ఈ అంబులెన్స్ సేవలు నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా చింతూరు ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ శుభం నోఖ్వాల్, ఐఏఎస్ మాట్లాడుతూ.
చింతూరు డివిజన్ భౌగోళికంగా విస్తృతంగా ఉండటంతో పాటు అధిక సంఖ్యలో మారుమూల గిరిజన ప్రాంతాలు ఉన్నాయని, అత్యవసర సమయాల్లో రోగులను త్వరితగతిన ఆసుపత్రులకు తరలించేందుకు ఈ అంబులెన్స్ సేవలు ఎంతో కీలకమని తెలిపారు. ముఖ్యంగా అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఉన్న రోగులు, గర్భిణీలు, ప్రమాద బాధితులు, వృద్ధులు మరియు మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అంబులెన్స్ను ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంచేందుకు ఐటీడీఏ (ITDA) చింతూరు తరఫున ప్రత్యేకంగా డ్రైవర్ను నియమించినట్లు ప్రాజెక్ట్ ఆఫీసర్ తెలిపారు.
అంబులెన్స్ నిర్వహణ, వినియోగం మరియు సేవలను సమర్థవంతంగా అందించేందుకు సంబంధిత వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులను సమీపంలోని వైద్య కేంద్రాలకు, అవసరమైన సందర్భాల్లో ఉన్నత స్థాయి ఆసుపత్రులకు సకాలంలో తరలించేందుకు ఈ సేవలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రజల ప్రాణ రక్షణకు, అత్యవసర వైద్య సేవలకు ఈ అంబులెన్స్ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చింతూరు డివిజన్ ప్రజలకు ప్రాజెక్ట్ ఆఫీసర్ విజ్ఞప్తి చేశారు.
# Yadagiri










