ఆంధ్రప్రదేశ్లోని ఏడుగురు జిల్లా కలెక్టర్లు ప్రతిష్ఠాత్మక గవర్నర్ స్వర్ణ పతకాలకు ఎంపికయ్యారు. తమ జిల్లాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) ద్వారా అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాలను ప్రకటించారు. సెప్టెంబర్ 1వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ వార్షిక సర్వసభ్య సమావేశంలో గవర్నర్ చేతుల మీదుగా ఈ పతకాలను అందజేయనున్నారు.
ఈ పురస్కారాలకు ఎంపికైన వారిలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాని, నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఉన్నారు. వీరితో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఈ గౌరవాన్ని అందుకోనున్నారు.
ఇటీవల జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశంలో ఈ ఎంపికను ఖరారు చేశారు. జిల్లా స్థాయిలో రెడ్ క్రాస్ కార్యకలాపాలను సమర్థవంతంగా సమన్వయం చేస్తూ, ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను ఈ కలెక్టర్లను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.










