స్కూల్ గేమ్స్ క్రీడాలను ప్రారంభించిన టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

0
2

హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) జిల్లా స్థాయి పాఠశాల క్రీడా పోటీలు 2026–27 ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలను టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ  బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్  శివసేన రెడ్డి, రాజ్యసభ సభ్యులు  అనిల్ కుమార్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా శివసేన రెడ్డి గారు మాట్లాడుతూ.. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత కల్పించడం ద్వారా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది వేయవచ్చని అన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలతో పాటు జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు SGFI వంటి పోటీలు ఎంతో దోహదపడతాయని అన్నారు. విద్యార్థులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, క్రీడాస్ఫూర్తితో పోటీపడి తమ ప్రతిభను చాటుకోవాలని ఆకాంక్షించారు.

ఈ పోటీల ద్వారా తెలంగాణ నుంచి మరింత మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలవాలని శుభాకాంక్షలు తెలిపారు.