ఆసిఫాబాద్‌లో శిరీషకు న్యాయం కోసం కొవ్వొత్తుల ర్యాలీ |

0
35

🎤భారత్ ఆవాజ్ న్యూస్, ఆసిఫాబాద్: హైదరాబాద్ శంషాబాద్ పరిధిలో ఆదివాసీ నర్సు శిరీషపై జరిగిన ఘోర హత్యాచారాన్ని నిరసిస్తూ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ప్రదర్శన కొమురం భీం విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వందలాది మంది విద్యార్థులు, నర్సులు బాధిత యువతికి ఘన నివాళులర్పించారు. నిందితుడైన కామాంధుడు సైనావుల్లా ఖాన్‌ను వెంటనే కఠినంగా శిక్షించాలని లేదా ఎన్‌కౌంటర్ చేయాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

దారుణం జరిగి ఇన్ని రోజులవుతున్నా ప్రభుత్వం నోరు విప్పకపోవడంపై మరియు ప్రధాన మీడియా ఈ ఘటనను చిన్నచూపు చూడటంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే గతంలో జైనూర్ తరహాలోనే జిల్లా వ్యాప్తంగా మహా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ మండల అధ్యక్షుడు కోడప జగన్, గోండేశ్వరి మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్నక శకుంతల, తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండోర్ మారుతీ, మంచిర్యాల జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు మడపచి భీంరావు కోట్నక కోట్నక రాంశావ్ రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెండోర్ సుధాకర్, రాయ్ సెంటర్ డివిజన్ అధ్యక్షుడు కోర్కెట జ్ఞానేశ్వర్, ఆదివాసి ఉపాధ్యాయ సంఘం నాయకులు కొమురం మదోరావు, కుర్సెంగ యాదోరావు, మారుతీ, ట్రైబల్ ఫెస్టివల్ కో-ఆర్డినేటర్లు కొమురం వెంకటేష్, కొమురం సీతారాం, సోషల్ మీడియా కన్వీనర్ కాత్లే ఈశ్వర్, నాయకులు మడవి పురుషోత్తం, అడ సోమేష్, కోట్నక వినేష్, నైతం తిరుపతి, రాజు తదితరులు పాల్గొన్నారు.