కాంగ్రెస్‌ హామీలు కొండంత.. అమలు గోరంత.|

0
9

● తాగునీరు, వీధి దీపాలు, ట్రాఫిక్‌, శాంతిభద్రతల సమస్యల పరిష్కారానికి డిమాండ్‌

● బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ ఆందోళన

● ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలమైందన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి

అల్వాల్‌, సెప్టెంబర్‌ 6: కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని అల్వాల్‌లో ఆదివారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భారీ ఆటోల ర్యాలీ నిర్వహించారు.

పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) పిలుపు మేరకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

మల్కాజ్‌గిరి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి కొరత, వీధి దీపాల సమస్య, శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ ఇబ్బందులతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసన చేపట్టాయి.

అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలో ప్రారంభమైన ఆటోల ర్యాలీ భూదేవి నగర్‌, వెంకటాపురం పీజేఆర్‌ విగ్రహం, ఎం.ఆర్‌. కృష్ణ రోడ్‌, జె.జె. నగర్‌, సత్య పెట్రోల్‌ బంక్‌, మీ-సేవ అల్వాల్‌, ఐ.జి. విగ్రహం, అంబేద్కర్‌ నగర్‌, సూర్యనగర్‌, మచ్చబొల్లారం, బొల్లారం గేట్‌ మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

అనేక హామీలతో ప్రజల మద్దతు పొందిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును విస్మరించిందని ఆరోపించారు.

మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో తాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. అనేక ప్రాంతాల్లో వీధి దీపాల సమస్య కొనసాగుతోందని, శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తగిన దృష్టి సారించడం లేదని విమర్శించారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానలు ఎంతో అవసరమని, నియోజకవర్గంలో వాటిని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు.

ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంబీసీ చైర్మన్‌ నందికంటి శ్రీధర్‌, మాజీ కార్పొరేటర్లు చింతల శాంతి శ్రీనివాస్‌ రెడ్డి, సబితా అనిల్‌ కిషోర్‌ గౌడ్‌తో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, యువకులు,ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

#Sidhumaroju

Alwal