🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్:
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే ఇస్తామన్న హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సరస్వతి, ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ మేంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ హైమద్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఉమ్మడిగా మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలను ప్రకటించి ప్రజలను నిలువునా మోసం చేశారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా సరిగ్గా అమలు చేయకుండా, నేడు బాధ్యతారాహిత్యంగా వెయ్యి రోజుల సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎలాంటి ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధి పనులు చేపట్టకుండా దేనికి సంబరాలు చేసుకుంటున్నారని వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బడాయిలు మానుకుని ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు మరియు ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










