మదనపల్లె: జాతీయ బ్యాంకుల నుంచి వందల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని మాఫీ పొందిన కోటీశ్వరులు, కార్పొరేట్ సంస్థల పేర్లను కేంద్ర ప్రభుత్వం బహిర్గతం చేయాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు. శనివారం కాంగ్రెస్ నాయకులు రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత 12 ఏళ్లలో రూ.16.50 లక్షల కోట్ల రుణాలు రద్దు చేసినట్లు పేర్కొన్న ఆయన, ఎస్సీ, ఎస్టీలకు కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందడం లేదని విమర్శించారు. డిలిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు.కరువు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి పేద రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రజాభీష్టానికి విరుద్ధంగా ప్రభుత్వాలు ముందుకు వెళితే నష్టపోతాయని చింతామోహన్ హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.










