● ఉద్యమకారుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
● ఆలస్యం చేస్తే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం: శ్రీనివాస్ గౌడ్
అల్వాల్, సెప్టెంబర్ 17: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అల్వాల్లోని దీక్షా శిబిరం వద్ద గురువారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.
కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి హాజరై ఉద్యమకారులకు సంఘీభావం తెలిపారు.
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి, ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదన్నారు. ఉద్యమ సమయంలో ఉపాధి, ఆస్తులు కోల్పోయి కుటుంబాలను ఇబ్బందులకు గురిచేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారని తెలిపారు. ఉద్యమకారుల కష్టాలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ కోసం ఉద్యమించి అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలతో పాటు ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు వారి తరఫున తన వంతు కృషి కొనసాగిస్తానని తెలిపారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలులో జాప్యం చేస్తూ ఉద్యమకారులను నిరాశకు గురిచేయవద్దన్నారు. ప్రభుత్వం వద్ద భూమి ఉన్నప్పటికీ వివిధ కారణాలతో హామీల అమలును ఆలస్యం చేయడం సరికాదన్నారు. సమస్యలను పరిష్కరించడంలో మరింత జాప్యం జరిగితే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.
జేఏసీ నాయకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో అల్వాల్ ప్రజలు ఉద్యమ స్ఫూర్తిని చాటుకున్నారని గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో కేసులు నమోదైన వారినే ఉద్యమకారులుగా పరిగణించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు.
పోలీస్, ఇతర ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న అధికారిక రికార్డులను పరిశీలించి అర్హులైన ఉద్యమకారులను గుర్తించి, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో పుట్నాల కృష్ణ, డోలి సుధీర్, అనిల్, సంతోష్, రషీద్, వీరస్వామి, మల్లేష్, సామ కిరణ్ కుమార్ రెడ్డి, పరమేశ్వర్, దొమ్మాటి కిరణ్, కీర్తి శ్రీనివాస్, ముత్యాలు, నర్సింహా, రామయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal










