● కంటోన్మెంట్లో ఘనంగా జన్మదిన వేడుకలు
● దేశాభివృద్ధిలో మోదీ కీలక పాత్ర: ఈటల
అల్వాల్, సెప్టెంబర్ 17: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్లోని అటల్ బిహారీ వాజ్పేయీ పార్క్లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని కేక్ కట్ చేసి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ 76 వసంతాలు పూర్తి చేసుకుని 77వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభవేళ ఆయన ఆయురారోగ్యాలతో దేశ ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగుతున్న నరేంద్ర మోదీ దేశాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.
భారతదేశ కీర్తిని ప్రపంచ స్థాయిలో చాటడంతో పాటు దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని మరింత పెంచిన నాయకుడిగా మోదీ నిలిచారని పేర్కొన్నారు.
‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేడ్ ఇన్ ఇండియా’ నినాదాలతో దేశాన్ని స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, జాతీయ రహదారుల నిర్మాణంతో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు.
దేశ మూలధన వ్యయాన్ని భారీగా పెంచి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. మోదీ మరింత కాలం దేశానికి సేవలందిస్తూ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal










