అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్ ఆసిఫాబాద్ పోలీసుల భారీ విజయం

0
1

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్)  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒక అంతర్ జిల్లా దొంగల ముఠాను ఆసిఫాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖైర్‌గావ్‌ గ్రామంలో తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు సవాల్‌గా తీసుకుని ఈ ముఠా గుట్టు రట్టు చేశారు.ఈ కేసును ఛేదించేందుకు జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపిస్తూ కారులో తిరుగుతున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితులను మంచిర్యాల జిల్లా తాండూర్ ప్రాంతానికి చెందిన ఉప్పట్ల ప్రణయ్, మంచిర్యాల సతీష్, రాజేశం మరియు శాలిగమ కృష్ణగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు నిందితులను తమదైన శైలిలో విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా పగటిపూట తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ ముందస్తుగా రెక్కీ నిర్వహించేవారని, అనంతరం కారులో ప్రయాణిస్తూ తాండూర్, జక్కులపల్లి, ఖైర్‌గావ్ మరియు రెబ్బెన తదితర ప్రాంతాల్లో వరుసగా ఇళ్ల తాళాలు పగులగొట్టి పెద్ద ఎత్తున బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించినట్లు విచారణలో అంగీకరించారు.అరెస్ట్ చేసిన నిందితుల నుండి పోలీసులు 10.3 తులాల బంగారం, 30 తులాల వెండి, 4 మొబైల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించిన ఒక స్విఫ్ట్ డిజైర్ కారుతో పాటు తాళాలు పగులగొట్టేందుకు ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను కోర్టులో హాజరుపరిచి, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్లిష్టమైన దొంగల ముఠాను అత్యంత చాకచక్యంగా పట్టుకున్న ఆసిఫాబాద్ డీఎస్పీ బి. అశోక్, రెబ్బెన ఇన్‌స్పెక్టర్ సంజయ్, సబ్-ఇన్‌స్పెక్టర్ వెంకట కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ మరియు కానిస్టేబుల్ నౌషాద్‌ల ప్రతిభను జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల భద్రతే తమ ప్రధాన బాధ్యత అని ఈ సందర్భంగా జిల్లా పోలీస్ యంత్రాంగం స్పష్టం చేసింది.