“నాయకుల చేతుల్లో ఎకరాలు పెరుగుతున్నాయి.. సామాన్యుడి చేతుల్లో మాత్రం EMIలు ఎందుకు పెరుగుతున్నాయి?” శ్రీను రావు పొన్నాల

0
1

తెలంగాణలో సామాన్యుడి బతుకు ఎప్పుడు మారుతుంది?

‎హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా, సామాన్య ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు ఎంతవరకు వచ్చిందనే ప్రశ్నను శ్రీను రావు పొన్నాల లేవనెత్తారు. ప్రభుత్వాలు మారుతున్నాయి..పార్టీలు మారుతున్నాయి.. నాయకులు మారుతున్నారు.. కానీ మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

‎నాయకులు అసెంబ్లీలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, బయటకు వచ్చి రాజకీయ విమర్శలు చేయడం కాకుండా.. ఒక సాధారణ కుటుంబం ఎలా బతుకుతోంది? అనే విషయంపై చర్చ జరగాలని అన్నారు.

‎నెల జీతం వచ్చిన వెంటనే ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు, కరెంట్ బిల్లు, ఇంటి ఖర్చులు, వైద్యం, ప్రయాణ ఖర్చులు, బ్యాంకు లోన్ల EMIలు కట్టిన తర్వాత మధ్యతరగతి కుటుంబం చేతిలో ఎంత మిగులుతుందో నాయకులు ఆలోచించాలన్నారు.

‎“నాయకుల చేతుల్లో ఎకరాలు పెరుగుతున్నాయి.. సామాన్యుడి చేతుల్లో మాత్రం EMIలు ఎందుకు పెరుగుతున్నాయి?” అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు.

‎రైతుకు పంట ఖర్చులు, యువతకు ఉద్యోగాల కోసం ఎదురుచూపులు, చిన్న వ్యాపారులకు పెరుగుతున్న ఖర్చులు, ఉద్యోగులకు కుటుంబ బాధ్యతలు, మధ్యతరగతి కుటుంబాలకు పిల్లల చదువులు, ఇల్లు, వైద్యం వంటి సమస్యలు రోజురోజుకూ భారంగా మారుతున్నాయని అన్నారు.

‎తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు పెద్ద పెద్ద భవనాలు, రోడ్లు, ప్రాజెక్టులు మాత్రమే కాకుండా.. ఒక సాధారణ కుటుంబం నెలాఖరును అప్పు చేయకుండా ఎలా గడుపుతోంది? అనేదే అసలైన ప్రశ్నగా ఉండాలని శ్రీను రావు పొన్నాల అన్నారు.

‎పార్టీలు మారాయి.. పాలకులు మారారు.. ప్రభుత్వాలు మారాయి.. కానీ “సామాన్యుడి బతుకులో ఎంత మార్పు వచ్చింది?” అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలని పేర్కొన్నారు.

‎ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయి? యువతకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? రైతుకు ఎంత భరోసా లభించింది? మధ్యతరగతి కుటుంబానికి జీవితం ఎంత సులభమైంది? అనే అంశాలపై రాజకీయ పార్టీలు ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆయన కోరారు.

‎చివరగా “ఇదేనా మనం కలలుగన్న తెలంగాణ?” అంటూ శ్రీను రావు పొన్నాల ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి అంటే కేవలం ప్రభుత్వ లెక్కల్లో కనిపించే అభివృద్ధి కాకుండా, ప్రతి సామాన్యుడి ఇంట్లో కనిపించే సంతోషం, భద్రత, ఆర్థిక స్థిరత్వం కావాలని ఆయన పేర్కొన్నారు.

‎— శ్రీను రావు పొన్నాల

‎Bharat Aawaz