స్పెషల్ ఆఫీసర్స్ విద్యార్థులతో భోజనం చేయాలి

0
3

వసతి గృహాల నిర్వహణపై నివేదికలు వెంటనే ఇవ్వాలి

జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.

మహబూబాబాద్ : కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని SC, ST, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల నిర్వహణ, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమంపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ… ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం రోజూ విద్యార్థులకు పరిశుభ్రమైన, రుచికరమైన మరియు పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని విభాగాలకు సంబంధించిన (126) సంక్షేమ వసతి గృహాల నిర్వహణ, 

అన్ని మౌలిక వసతులు, మైనర్ రిపేర్లు, డైనింగ్, స్టడీ, డైట్ మెనో, ఫిర్యాదుల బాక్స్ ల నిర్వహణ, హెల్త్, న్యూట్రిషన్, సానిటేషన్, లపై సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.

 

వంట సిబ్బందికి క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. “ప్రజా పాలన – సంక్షేమ వారోత్సవాలు / యాక్షన్ ప్లాన్” లో భాగంగా ప్రతి వారం పారిశుధ్యం, హాస్టల్ గదుల శుభ్రత, వాష్‌రూమ్‌ల నిర్వహణ, చిన్నచిన్న మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. బియ్యం, నిత్యావసర సరుకులు నిల్వ చేసే స్టోర్ రూమ్‌లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. 

 

మీ స్కూల్లో ఫిర్యాదుల పెట్టెలు పెట్టారా…

 

విద్యార్థులు తమ సమస్యలు, సూచనలను నిర్భయంగా తెలిపేందుకు ప్రతీ వసతి గృహంలో తప్పనిసరిగా ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రతి హాస్టల్‌ను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడానికి అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు కలెక్టర్ తెలిపారు.

సమగ్ర వికాసం కేవలం చదువుకే పరిమితం కాకుండా విద్యార్థులలో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కోసం ఆటలు, వ్యాయామం మరియు ఇతర మానసిక వికాస కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. వార్డెన్లు, సంక్షేమ అధికారులు హాస్టళ్లలోనే అందుబాటులో ఉండాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కలెక్టర్ స్వయంగా హాస్టళ్లను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ, అక్కడ లభిస్తున్న సదుపాయాలను నేరుగా సమీక్షిస్తారన్నారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి, ఇంచార్జ్ మైనార్టీ అధికారిని నాగలక్ష్మి, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి దేశీ రామ్ నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు, డిసిఓలు, ఆర్సిఓలు, గాయత్రీ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.