• రైల్వే పోలీస్ ఫోర్స్లో డిప్యూటేషన్పై విధులు
• వైరల్ వీడియోపై దక్షిణ మధ్య రైల్వే విచారణ
• సర్వీస్ నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ కేసు
• సైబరాబాద్ సీపీకి డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు
అల్వాల్, సెప్టెంబర్ 19: హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి చేసిన ఘటనలో తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన హోంగార్డుపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
అతను రైల్వే పోలీస్ ఫోర్స్లో డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మహిళపై దాడికి సంబంధించిన వీడియో శుక్రవారం రాత్రి నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
వీడియోలో యూనిఫాంలో ఉన్న వ్యక్తి మహిళపై దాడి చేయడంతో పాటు ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.
ఘటనపై తీవ్ర స్పందన వ్యక్తం కావడంతో రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.
తొలుత సదరు వ్యక్తిని రైల్వే పోలీస్ కానిస్టేబుల్గా భావించినా.. దక్షిణ మధ్య రైల్వే విచారణలో అతను తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన హోంగార్డుగా గుర్తించారు. హఫీజ్పేట్ రైల్వే స్టేషన్లో విధులు నిర్వహించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ నుంచి అతడిని డిప్యూటేషన్పై పంపినట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
అనంతరం డిప్యూటేషన్ రద్దు చేసి తెలంగాణ పోలీస్ శాఖకు తిరిగి పంపినట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై డీజీపీ సీవీ ఆనంద్ స్పందిస్తూ.. హోంగార్డును సర్వీస్ నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తక్షణమే చర్యలు చేపట్టాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను ఆదేశించినట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. వైరల్ వీడియోలో కనిపించిన దృశ్యాలతో పాటు ఘటనకు దారితీసిన పరిస్థితులు, పూర్తి క్రమాన్ని అధికారులు పరిశీలించాల్సి ఉంది.
వీడియో ఆధారంగా మాత్రమే ఘటనకు కారణాన్ని నిర్ధారించకుండా దర్యాప్తులో వెలువడే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి.
#Sidhumaroju
Alwal









