రాజకీయం అనే నాటకంలో… ప్రజాసేవ ఒక బూటకపు వేషం

0
4

ప్రజాసేవ పేరుతో రాజకీయ రంగప్రవేశం…

‎ప్రజల సమస్యల పరిష్కారం పేరుతో హామీలు…

ప్రజల మధ్యకు వచ్చి చేతులు కలపడం…

‎అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అదే ప్రజలను మరిచిపోవడం!

‎ఇదేనా నేటి రాజకీయం?

‎“రాజకీయం అంటే ప్రజాసేవ” అని ఒకప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు కేవలం ఎన్నికల వేదికలపై వినిపించే నినాదాలుగా మారుతున్నాయా అన్న ప్రశ్న ప్రజల్లో వినిపిస్తోంది.

‎తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు తీవ్రస్థాయికి చేరాయి. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రజా సమస్యలపై చర్చ కంటే రాజకీయ ఘర్షణలు ప్రధానంగా కనిపించాయన్న విమర్శలు వచ్చాయి.

‎ఒకవైపు అధికార పక్షం తమ పాలనను సమర్థించుకుంటోంది.

‎మరోవైపు ప్రతిపక్షం ప్రభుత్వం ఇచ్చిన హామీలను, పాలనా తీరును ప్రశ్నిస్తోంది.

‎కానీ ఈ రాజకీయ పోరాటంలో ప్రజల అసలు సమస్యలు ఎక్కడ?

‎రైతుకు కావాల్సిన భరోసా ఎక్కడ?

‎నిరుద్యోగ యువతకు కావాల్సిన ఉద్యోగం ఎక్కడ?

‎సామాన్యుడికి కావాల్సిన నిత్యావసరాల భద్రత ఎక్కడ?

‎గ్రామానికి కావాల్సిన అభివృద్ధి ఎక్కడ?

‎ఎన్నికల సమయంలో ప్రజలు గుర్తుకొస్తారు.

‎ఎన్నికల తర్వాత రాజకీయ లెక్కలు మొదలవుతాయి.

‎పదవి కోసం పోటీ… పార్టీ కోసం పోరాటం…

‎అధికారం కోసం వ్యూహాలు…

‎కానీ ప్రజల కోసం?  అక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది.

‎ప్రజాసేవ నిజంగా ఒక బాధ్యతా?

‎లేక అధికారాన్ని అందుకునేందుకు వేసుకునే రాజకీయ వేషమా?

‎అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా—ప్రజలు కోరుకునేది ఒకటే.

‎మాటలు కాదు… పని. ప్రచారం కాదు… పాలన. రాజకీయ నాటకం కాదు… ప్రజా ప్రయోజనం. రాజకీయం మారాలంటే ముందుగా రాజకీయ నాయకుల మాటలు కాదు, వారి చర్యలు మారాలి.

‎ఎందుకంటే ప్రజలు ప్రేక్షకులు కాదు…

‎వాళ్లే ఈ ప్రజాస్వామ్యానికి అసలు యజమానులు.

‎— శ్రీను రావు పొన్నాల