మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ ల్లోని పలు బస్తీల్లో పెండింగ్లో ఉన్న డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అధికారులను కోరారు.
బుధవారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజను ఆమె కార్యాలయంలో కలిసి క్షేత్రస్థాయి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
ముఖ్యంగా లక్ష్మీ నగర్ (లోత్ కుంట), ఇంద్రానగర్, భీమ్ రావు నగర్, ఎంఈఎస్ కాలనీ, ప్రశాంత్ నగర్, బండబస్తీ, వెంకట్రావు పేట మరియు స్టేషన్ బస్తీ ప్రాంతాల్లో ఇప్పటికే మంజూరైన పనులు నత్తనడకన సాగుతుండటంపై శాంతి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పనుల జాప్యం కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పౌర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. మంజూరైన ప్రతి పనిని తక్షణమే పట్టాలెక్కించి, ప్రజలకు అసౌకర్యం కలగకుండా పూర్తి చేయాలని ఈడీని కోరారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజ, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పర్యవేక్షించి, జాప్యాన్ని నివారించేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పెండింగ్ పనులన్నింటినీ త్వరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆమె భరోసా ఇచ్చారు.
#sidhumaroju
Alwal










