టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన
మే 10, 11 తేదీలలో ఆన్లైన్ పద్ధతిలో రాతపరీక్షలు.ఈ నెల 29 లోగా పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాలని సూచన
మే 2 నుంచి అభ్యర్థులకు అందుబాటులోకి హాల్టికెట్లు .పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ చూడాలని వెల్లడి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలోని పలు పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మే 10, 11 తేదీలలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్), అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్) పోస్టులను భర్తీ చేయనున్నారు.
పరీక్షల షెడ్యూల్ వివరాలు:
విడుదలైన షెడ్యూల్ ప్రకారం మే 10వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏఈఈ (సివిల్) పరీక్ష, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏఈఈ (ఎలక్ట్రికల్) పరీక్ష నిర్వహిస్తారు. ఇక, మే 11వ తేదీన ఉదయం సెషన్లో ఏఈ (సివిల్) పరీక్ష, మధ్యాహ్నం సెషన్లో ఏటీవో (సివిల్) పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలు కూడా ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు:
ఈ పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థులు తమకు అనుకూలమైన పరీక్షా కేంద్రాలను ఆన్లైన్లో ఎంపిక చేసుకోవాలని టీటీడీ సూచించింది. ఏప్రిల్ 24 నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ అవకాశం కల్పించారు. నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత పరీక్షా కేంద్రాలను ఎంచుకోవడానికి లేదా మార్చుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి, గడువులోగా తమ ఎంపికను పూర్తి చేసుకోవాలని కోరారు.
పరీక్ష రాసేందుకు అవసరమైన హాల్టికెట్లను మే 2వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు తమ షిఫ్ట్ వివరాలను సరిచూసుకొని, అవసరమైన ‘కాండిడేట్ కన్ఫర్మేషన్’ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. పరీక్షలకు సంబంధించిన ఏవైనా సందేహాలుంటే, పూర్తి వివరాల కోసం అభ్యర్థులు టీటీడీ కాల్ సెంటర్ నంబర్ 155257ను లేదా అధికారిక వెబ్సైట్ https://ttdrecruitment.aptonline.inను సంప్రదించాలని అధికారులు సూచించారు.










