“కరీంనగర్ నిందితుల ఫోటోలు ఇవే! – అప్రమత్తమైన అల్వాల్ పోలీసులు.|

0
30

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కరీంనగర్ పట్టణంలో సంచలనం సృష్టించిన జ్యువెల్లరీ దుకాణం దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.

మే 3. 2026. ఆదివారం ఉదయం సుమారు 10-11 గంటల సమయంలో నగరంలోని పీఎంజే జ్యువెల్లరీ దుకాణంలోకి తుపాకులతో వచ్చిన దుండగులు కాల్పులు జరిపి భారీగా బంగారం దోచుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

దుకాణం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగులు కాల్పులకు తెగబడి సిబ్బందిని అదుపులోకి తీసుకుని దోపిడీకి పాల్పడ్డారు.

ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఈ కేసుకు సంబంధించి నిందితుల ఫోటోలను కరీంనగర్ పోలీసులు అధికారికంగా విడుదల చేశారు.

పోస్టర్‌లో ఉన్న ఐదుగురు అనుమానితుల ఆచూకీ తెలిపిన వారికి రూ.1 లక్ష నగదు బహుమతి ప్రకటించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

ఇదిలా ఉండగా, ఈ పోస్టర్‌లోని వివరాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని అల్వాల్ పి‌ఎస్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

పోస్టర్‌లో కరీంనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సంప్రదింపు నంబర్లు కూడా ఇవ్వబడిన నేపథ్యంలో, నిందితుల గురించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే ఆ నంబర్లకు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు, లేక అత్యవసర నంబర్ 100కు తెలియజేయాలని పోలీసులు కోరారు.

నిందితులు ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రజల సహకారంతో ఈ సంచలన దోపిడీ కేసును త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

#Sidhumaroju