హైదరాబాద్ : భారత రక్షణ చరిత్రలో మే 7వ తేదీ ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక సువర్ణ అధ్యాయం. ఉగ్రవాదంపై భారత్ సాధించిన అఖండ విజయానికి ప్రతీకగా నిలిచిన ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో వేడుకలు జరిగాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా తన సోషల్ మీడియా ‘ఎక్స్’ ఖాతా ప్రొఫైల్ పిక్చర్ను ఆపరేషన్ సింధూర్ చిత్రానికి మార్చి మన జవాన్ల ధైర్యసాహసాలకు ఘన నివాళులు అర్పించారు.
భారత అవాజ్ ఈ ప్రత్యేక సందర్భంలో మన దేశ భద్రతా దళాల అద్భుత శక్తిసామర్థ్యాలను మరియు శత్రువుల గుండెల్లో నిద్రపోయిన మన జవాన్ల పరాక్రమాన్ని మరోసారి ప్రపంచానికి గుర్తుచేస్తోంది.
సరిగ్గా ఏడాది క్రితం ఏప్రిల్ 2025లో పహల్గామ్ పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పిరికిపంద దాడికి భారత ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
ఆ ఘటనకు ప్రతీకారంగా మే 7, 2025న మన సైన్యం అత్యంత రహస్యంగా, వ్యూహాత్మకంగా ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది.
కేవలం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలు మాత్రమే కాకుండా, పాక్ భూభాగంలోని ప్రధాన శిబిరాల మీద కూడా భారత వాయుసేన మరియు క్షిపణి దళాలు నిప్పులు కురిపించాయి.
ఈ ఆపరేషన్ ద్వారా ‘కొత్త భారత్ శత్రువుల ఇంటికి వెళ్లి మరీ కొడుతుంది’ అనే బలమైన సందేశాన్ని ప్రధాని మోదీ ప్రపంచానికి అందించారు.
సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులను తుదముట్టించి, వారి మౌలిక సదుపాయాలను నామరూపాలు లేకుండా చేయడం మన సైనిక పటిమకు నిదర్శనం.ఈ యుద్ధ తంత్రంలో మన భద్రతా దళాలు చూపిన ప్రతిభ అసాధారణమైనది.
భారత సైన్యంలోని త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో పనిచేసి శత్రువును ఉక్కిరిబిక్కిరి చేశాయి. గగనతలంలో భారత వైమానిక దళం పట్టు సాధించడమే కాకుండా, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన డ్రోన్లు మరియు అత్యంత శక్తివంతమైన క్షిపణులను వాడి ప్రపంచ రక్షణ రంగ నిపుణులను ఆశ్చర్యపరిచారు.
ఈ ఆపరేషన్లో ఎక్కడా సామాన్య పౌరులకు నష్టం జరగకుండా, కేవలం ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్న మన జవాన్ల ‘ప్రెసిషన్ స్ట్రైక్’ సామర్థ్యం మన దేశ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో పెంచింది. ప్రాణాలకు తెగించి దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో కాపలా కాసే మన జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ, ఆపరేషన్ సింధూర్ విజయ వార్షికోత్సవం సందర్భంగా యావత్ భారతావని సగర్వంగా సెల్యూట్ చేస్తోంది.
#Sidhumaroju










