బండి భగీరథ్ కేసులో కీలక ట్విస్ట్, అమ్మాయి ఫోటోలు షేర్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ భారీ యాక్షన్..!

0
6

14 May 2026: బండి భగీరథ్‌కు సంబంధించిన POCSO కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. బాధితురాలి ఫోటోలు, వీడియోలు, గుర్తింపు బయటపడేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్, ఫేస్‌బుక్ పేజీలు, టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సాప్ అకౌంట్లపై సైబర్ క్రైమ్ పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తూ దర్యాప్తు వేగవంతం చేశారు. చాలా మంది “న్యూస్ కోసమే పెట్టాం”, “మాకు తెలియదు”, “కేవలం ఫార్వర్డ్ చేశాం” అని భావించినా… చట్టం మాత్రం దీనిని చాలా తీవ్రమైన నేరంగా చూస్తోంది.

‎ప్రస్తుతం పోలీసులు ముఖ్యంగా బాధితురాలి గుర్తింపు బయటపడేలా చేసిన పోస్టులు, యూట్యూబ్ థంబ్‌నెయిల్స్, రీల్స్, స్టేటస్‌లు, స్క్రీన్‌షాట్లు అన్నింటినీ ట్రాక్ చేస్తున్నట్లు సమాచారం. ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందంటే అది సరదా విషయం కాదు… అది నేరంగా మారే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా POCSO కేసుల్లో పిల్లల గోప్యతను కాపాడటం చట్టపరంగా అత్యంత కీలకమైన అంశం.

‎Protection of Children from Sexual Offences Act (POCSO Act) Section 23 ప్రకారం బాధితురాలి పేరు, ఫోటో, వీడియో లేదా గుర్తింపు తెలిసే ఏ సమాచారం అయినా ప్రచురించడం నిషేధం. ఇది కేవలం పెద్ద మీడియా సంస్థలకు మాత్రమే కాదు… యూట్యూబ్ ఛానల్స్, ఫేస్‌బుక్ పేజీలు, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సాప్ స్టేటస్‌లకు కూడా వర్తిస్తుంది. ఒకవేళ ఉల్లంఘిస్తే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా పడే అవకాశం ఉంది.

‎ఇక Bharatiya Nyaya Sanhita (BNS) ప్రకారం మహిళ లేదా బాలిక గౌరవాన్ని దెబ్బతీయడం, ప్రైవసీని ఉల్లంఘించడం, అసభ్య లేదా అవమానకర కంటెంట్ ప్రచారం చేయడం వంటి నేరాల కింద కూడా కేసులు నమోదు చేయవచ్చు. ఉద్దేశపూర్వకంగా వైరల్ చేయడం, రీపోస్ట్ చేయడం, షేర్ చేయడం చేసిన వారిపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

‎మరోవైపు IT Act Section 67, 67B కూడా చాలా సీరియస్ సెక్షన్లుగా పరిగణించబడుతున్నాయి. పిల్లలకు సంబంధించిన అసభ్య లేదా లైంగిక కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో ప్రచారం చేయడం, షేర్ చేయడం, స్టోర్ చేయడం కూడా నేరమే. ఈ సెక్షన్ల కింద జైలు శిక్షతో పాటు భారీ ఫైన్ పడొచ్చు. పోలీసులు ప్రస్తుతం సోషల్ మీడియా డేటా, IP అడ్రసులు, యూట్యూబ్ అప్లోడ్ హిస్టరీ, టెలిగ్రామ్ లింకులు వంటి వాటిని సేకరిస్తున్నట్లు సమాచారం.

‎ఇక్కడ చాలా మందికి తెలియని ముఖ్యమైన విషయం ఏమిటంటే… కేవలం ఒరిజినల్‌గా పోస్ట్ చేసిన వారిపైనే కాదు… “ఫార్వర్డ్” చేసినవారు, “రీపోస్ట్” చేసినవారు, “స్టేటస్” పెట్టినవారు, యూట్యూబ్ థంబ్‌నెయిల్‌లో ఫోటో పెట్టినవారిపైనా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో “ఒక్కసారి షేర్ చేస్తే ఏమవుతుంది?” అనే నిర్లక్ష్య ధోరణి ఇప్పుడు చాలా మందిని చట్టపరమైన ఇబ్బందుల్లోకి నెట్టే పరిస్థితి కనిపిస్తోంది.

‎ఇలాంటి సెన్సిటివ్ కంటెంట్ కనిపించినప్పుడు వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడం, లేదా National Cyber Crime Reporting Portal ద్వారా ఫిర్యాదు చేయడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. అలాగే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి కూడా కంప్లైంట్ ఇవ్వవచ్చు. సోషల్ మీడియా వాడకం ఎంత పెరిగిందో… అదే స్థాయిలో చట్టపరమైన బాధ్యత కూడా పెరిగిందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.